త్యాగవీరుల విజయం - ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ November 1st, 2007క్షణమయినా తీరిక లేని ఈ అవిశ్రాంతపు జీవితాలలో మనం గుర్తుపెట్టుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి, వాటిలో ముఖ్యమయిన విషయం మన మాతౄస్థలం ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ, దానిని సాధించే క్రమంలో తన ప్రాణాలని సైతం ధారపోసి తెలుగునేలకి, తెలుగువారికి తొలి గుర్తింపు తెచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములగారి గురించి కాసేపు స్మరించుకుందాం.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు సాధించాలనే పోరాటాలు 1920 వ సంవత్సరంలోనే మొదలైనప్పటికి అప్పటిలో భారతదేశ సాధన ముఖ్యమవ్వటంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంశం మరుగనపడింది.
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తొలిసారిగా ప్రయత్నించినవారిలో ముఖ్యులు సీతారాం గారు (స్వామి). ఆయన 1951 వ సంవత్సరంలో రాష్ట్ర సాధనకోసం నిరాహారదీక్ష ప్రారంభించారు, 35 రోజుల అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు వీనోభాబావే గారి హామీ మేరకు ఆ ప్రయత్నాన్ని సీతారాం గారు విరమించారు.
అప్పటి ప్రధానమంత్రి నెహ్రుగారు మరియు మద్రాస్ ముఖ్యమంత్రి రాజగొపాలాచారి గారు ఈ భాషాప్రయుక్త రాష్ట్రాలు అంశాన్ని మరల ప్రక్కనపెట్టారు. 1952 వ సంవత్సరంలో ప్రధానమంత్రి నెహ్రుగారు పార్లమెంట్ ని ఉద్దేశించి ఇలా అన్నారు - తెలుగు, కన్నడ, మళయాలం, మరాటి, గుజరాతి, ఒరియా మట్లాడే వారందరు వారి వారి భాషా ప్రయుక్త రాష్త్రాలు కావాలని కోరుకుంటున్నారు, ఇది ఇప్పటి లో సాధ్యపడదు. మనం ఎంతో శ్రమించి ఇటీవలే భారతదేశాన్ని సాధించుకొన్నాం, మంచితరుణం వచ్చినప్పుడు ఈఅంశం గురించి ఆలోచిద్దాం ఆన్నారు. ఆత్రుతగా ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం ఎదురుచూస్తొన్న ఎంతోమంది ఆంధ్రులికి ఇది తీవ్ర అసంతృప్తిన్ని అసహనానికి గురిచేసింది.
ఆ రగులుతున్న ఆవేశంలోనుంచి ఓ మహామనిషి ఆంధ్రరాష్ట్ర సాధనకోసం నడుంకట్టారు, ఆయనే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములగారు. ఆయన 1901 వ సంవత్సరం మార్చి 16న మద్రాస్ లో జన్మించారు, Sanitary engineering లో పట్టభద్రులయ్యారు. ఆ తరువాత కొంతకాలం Indian Railway's లో పనిచేసారు. 1930 వ సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ సత్యాగ్రహపోరాటంలో ఆయన 18నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించారు.
ఆంధ్రప్రదేశ్ సాధనకోసం ఆయన 1952 అక్టోబర్ 19న ఆమరణ నీరాహారదీక్ష చేపట్టారు, ఈ సందర్భంగా చాలా మంది ఆంధ్రులు నెహ్రూగారికి ఉత్తరాలద్వారా తమ మనోభావాలని వ్యక్తపరిచారు.
దీనికి ప్రతిస్పందించిన నెహ్రూగారు రాజగొపాలాచారి కి 1952 డిసెంబర్ 12న ఒకలేఖ వ్రాసారు ఇలా -- నాకు తెలుగు వారినుండి చాలా ఉత్తరాలు అందుతున్నాయి, అక్కడ పరిస్థితి నాకు ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎర్పాటుకు సమయం ఆసన్నమయ్యిందని ఆ లేఖలో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈవిషయాన్ని అధికారికింగా ప్రకటించటంలో కొంత జాప్యం జరిగింది.
ఆలోగా అప్పటికే 56 రోజులు నిరాహారదీక్ష చేసిన శ్రీ పొట్టి శ్రీరాములగారు తుది శ్వాసను (1952 డిసెంబరు 15న) విడిచారు. దానికి ప్రతిస్పందించిన తెలుగువాడి ఆగ్రహజ్వాలల్లో తెలుగు రాష్ట్రమంతా అల్లకల్లోలమయ్యింది, నెహ్రూ మరియు రాజగోపాలచారికి వ్యతిరేకంగా లక్షలాదిమంది ప్రభుత్వకార్యాలయాల్ని నాశనం చేసారు, రైళ్ళ రాకపోకలు స్తంభించిపోయాయి, పోలీసుల కాల్పులలో ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘొరానికి ప్రతిస్పందిస్తూ నెహ్రూ గారు 1952 డిసెంబరు 16న ఆంధ్రరాష్ట్రం త్వరలో ఏర్పడపోతుందని ప్రకటించారు. 1956 నవంబర్ 1న ఆ అమరజీవి ప్రాణత్యాగ ఫలితంగా మన ఆధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా ఆవిర్భవించింది.
ఇట్లు: సత్యసురేష్ దోనేపూడి.
పూర్తిగా చదవండి