తెలుగు చిత్రరంగంలో వాస్తవవాద దృక్పథంతో సినిమాలు నిర్మించి జాతీయస్థాయిలో గుర్తింపును అందుకున్న అతి కొద్దిమంది దర్శకుల్లో బి.ఎస్.నారాయణ ఒకరు. ఆయన తన నలభై ఏళ్ళ సినీరంగ ప్రస్థానంలో 32 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ అందులో ఎక్కువ శాతం వ్యాపార చిత్రాలే.

హెచ్.వి.బాబు, కె.బి.తిలక్, కె.ఎస్.ప్రకాశ్ రావు లాంటి దర్శకుల వద్ద అసిస్టెంట్గానూ, అసోసియేట్ గానూ పనిచేసిన బి.ఎస్.నారాయణ 1960 తర్వాత తానే స్వీయదర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం ఆరంభించారు.శ్రీదేవి, పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి చిత్రాలు నిర్మించిన ఆయనే తన రెండు చిత్రాల్లో కథాంశంలోనూ, చిత్ర నిర్మాణ సరళిలోనూ వాస్తవ వాద దృక్పథాన్ని ప్రదర్శించారు. 1977 లో ’ఊరుమ్మడి బతుకులు’, 1979 లో ’నిమజ్జనం’ లకు దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు రాష్ట్ర జాతీయ  స్థాయిల్లో బహుమతులు గెల్చుకున్నాయి. విమర్శకుల్నించి మంచి మన్ననలు అందుకున్నాయి.

ఆయన ’నిమజ్జనం’ జాతీయ అవార్డుతోపాటు, పనోరమా ఎంట్రీని, అందులో నటించిన శారదకు జాతీయ ఉత్తమనటి ’ఊర్వశి’ అవార్డును గెలుచుకుంది. ’నిమజ్జనం’ స్త్రీని ముఖ్యాభినేతగా చేసి నిర్మించిన చిత్రం. ఇందులో భారతీయ స్త్రీ సెక్సుపరంగా హింసకు గురయినప్పుడు, రేప్ చేయబడినప్పుడు ఆమె వేదన, అతలాకుతలమయిన ఆమె జీవితమూ, శీలం పోయిందన్న వ్యధ, మామూలు జీవితం జీవించలేనేమోనన్న భావన వీటన్నిటి పర్యవసానంగా గంగలో కలిసిపోయి ’నిమజ్జనం’ అయిన ఆమె మానసిక, శారీరిక సఘర్షణ ఈ చిత్రంలో మౌళికాంశం. ’అత్యాచారం’ అనే ఒక సామాజిక హింసకు బలయిన స్త్రీ జీవన వ్యధ ఈ చిత్రం.

నిజానికి ఎవడో చేసిన ’నేరానికి’ మన సమాజం బాధితురాలిపైనే అప్రకటితంగా తీవ్రమయిన శిక్ష వేస్తుంది. ఈ ’అత్యాచారం’లో పురుష రాజకీయాలున్నాయు. స్వార్థాలున్నాయి.స్త్రీని స్వంత ఆస్థిగా భావించే ఆలోచనలున్నాయి. అంతే కాదు తన ప్రమేయం లేకుండా పశుబలానికి, పశు వాంఛకి ఫలితంగా జరిగిన అత్యాచారం వల్ల తన శీలం పోయిందని తన భర్తకి తన కుటుంబానికి తీవ్రమయిన అన్యాయం జరిగిపోయిందనే భావజాలాన్ని స్త్రీల ఆలోచనల్లోకి బాగా చొప్పించిందీ సమాజం. తన ప్రమేయమే లేకుండా జరిగిన హింసకు తనెలా బాధ్యత వహిస్తాననే ఆలోచన రాకుండా తను మలినమయిపోయానని, తనకు ప్రాయశ్చిత్తం జరగాలనే ఆలోచనా ధోరణి కలిగేందుకు ఈ సమాజం చాలా జాగ్రత్తగా స్త్రీ చుట్టూ ఓ భావజాల వలయాన్ని సృష్టించింది. దాని ఫలితంగానే అత్యాచారం జరిగినప్పుడు బాధ్యుడయిన పురుషులు అత్యధిక శాతం రొమ్ము విరుచుకుని తిరగడం, బాధితురాలయిన స్త్రీ తీవ్ర నష్టానికి గురవడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు బాధితురాలయిన స్త్రీ అత్మార్పణ చేసుకున్న సందర్భాలూ మనకు కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి అంశాన్నే ఇరుసుగా చేసుకుని బి.ఎస్.నారాయణ ’నిమజ్జనం’ నిర్మించారు. అయితే ’రేప్’ ని సామాజిక రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగత కోణంలోంచి విశ్లేషించి కుహనా విలువల్ని విశ్లేషిస్తాడు దర్శకుడు. అంతే కాకుండా చివర్లో రేప్ కు బాధ్యుడైన పురుషుడిలో కూడా పరివర్తన చూపించి అతడుకూడా చనిపోయేలా చూపించి సంస్కరణాంశాన్ని ప్రాయశ్చిత్తాంశాన్ని ముందుకు తెస్తాడు. సమాజిక అధిపత్యాంశాల్ని విఇచి వ్యక్తిగత పరితాపాన్ని ఫోకస్ చేసి మౌళికమయిన విలువల అంశాల్ని వదిలేసి దర్శకుడు నిరాశనే కలిగిస్తాడు కాని సినిమాని నడిపించిన తీరులోనూ, చిత్రీకరణలోనూ చూపించిన మెళకువలు ’నిమజ్జనాన్ని’ మంచి చిత్రంగానే నిలిపాయి.

చిత్ర కథాంశం విషయానికి వస్తే తన తండ్రి అస్థికలు గంగలో కలపడానికి శ్రీకాంత్ తన భార్య భారతితో కలిసి కాశీకి బయలుదేరుతాడు. పల్లెగుండా ప్రయాణం చేసి కొంత అడవిలాంటి ప్రాంతాన్ని దాటితే గాని రైల్వే స్టేషన్ కు చేరుకోలేని పరిస్థితి వారిది. అందుకే ఎడ్లబండిలో బయలుదేరుతారు. ప్రయాణపు బడలికలో భర్త ఒడిలో పడుకున్న భారతి సౌందర్యాన్ని చూసి బండివాడు గోవిందులో కలవరం కలుగుతుంది. ఆమెను అనుభవించాలనే ఆలోచనలూ పెరుగుతాయి. బండి చక్రపు ఇరుసుకు కట్టిన అస్థికల మూట కనిపించడం లేదని గోవిందు హఠాత్తుగా చెప్పేసరికి శ్రీకాంత్ హతాశుడవుతాడు. బండిదిగి వెనక్కి పరుగుతీస్తాడు. భారతి కూడా అతన్ని అనుసరింబోతే వృధాగా మీరెందుకు శ్రమ పడడమని బండివాడు వారిస్తాడు. మూటను వెతుక్కుంటూ శ్రీకాంత్ వెనక్కి వెళ్ళింతర్వాత గోవిందు తన పశు బలంతో భారతిపై అత్యాచారం జరుపుతాడు. శ్రీకాంత్ తిరిగి వచ్చేసరికి మామూలుగా ఉండిపోతాడు గోవిందు. భారతి మాత్రం నిర్లిప్తింగా ఉదాసీనంగా కనబడుతుంది. శ్రీకాంత్ అడుగుతాడు ఏమయిందని. ఆమె ఏమీ చెప్పకుండా నిర్లిప్తంగా ఉండిపోతుంది. ఆమె మౌనంగా కాశీ చేరుతుంది. కాశీలో నిమజ్జనం శాస్త్రయుక్తంగా చేస్తారు. అయితే శ్రీకాంత్ తో పాటు గంగో మునిగిన భారతి పైకి లేవదు. గంగలో కలిసి పోతుంది. శ్రీకాంత్ హతాశుడవుతాడు. తీవ్రంగా గాలిస్తాడు. కాని భారతి నీటిలో మునిగిపోయి కనిపించదు. భార్యను పోగొట్టుకున్న శ్రీకాంత్ దు:ఖంతో తిరుగు ప్రయాణమవుతాడు.రైలు దిగగానే బండివాడు గోవిందుకు విషాద వార్తను చెబుతాడు. గోవిందులో పశ్చాత్తాపం చెలరేగుతుంది. తాను చేసిన అత్యాచార ఫలితమే భారతి మరణమని తలచి దు:ఖపడతాడు. శ్రీకాంత్ ని ఊరు తిరిగి తీసుకెళ్తూ గోవిందు చనిపోతాడు. టూకీగా ఇదీ కథ. ఇందులో చిత్రీకరణ అత్యంత రియలిస్టిక్ గా వుంటుంది. సంభాషణలు అతి తక్కువగా ఉండి సినిమా అధికశాతం దృశ్యపరంగానే సాగుతుంది.

భారతి పాత్రలో శారద అత్యున్నత నటనని ప్రదర్శించింది. రేప్ న వ్యక్తిగత, మానసిక కోణంలోంచి చర్చించిన వాస్తవవాద సినిమా ’నిమజ్జనం’ తెలుగు చిత్ర చరిత్రలో ఓ మైలురాయి.


పూర్తిగా చదవండి